Friday, January 2, 2015

కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి



కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు. వివాహము రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు. వివాహము అయి విడాకులు తీసుకున్నవారు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు.

ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజదోషము జాతక చక్రములో వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును. స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

వ్రతాన్ని ఎలా ఆచరించాలి.. నియమాలేంటి ?
మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది.
నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి,నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును.
దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును.

బంగారముతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్క తీసినవి) కూడా నైవేద్యముగా సమర్పించాలి.

వ్రతము పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనము చేయాలి.

మంగళ వారములు భక్తితో జరుపవలెను. మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆ పై వారము జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారము ఉద్యాపన జరుపుకోవాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కానీ వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానమునకు ఇచ్చి రావాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి ) వారిచే అక్షతలు వేయించుకుని ఆశీర్వాదము పొందాలి

ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును వుంచి కలశములో పవిత్రమైన నీరుసగము పోయాలి.

అమ్మ వారి విగ్రహము (ఉన్నచో ) లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రము చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోయవలెను.

బియ్యం పైన రాగి చెంబు కానీ , ఇత్తడి చెంబు కానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టాలి. (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతములో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్దములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపములో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి.

సాయం కాలము ఈ వ్రతము ఆచరించవలెను. పగలంతా ఉపవాసము ఉండవలెను. వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి.

పగలు నిద్రపోరాదు. చివరి వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకములను ఇచ్చిన చాలా మంచిది...

No comments:

Post a Comment