Thursday, January 1, 2015

గౌతమ మహర్షి కథ

ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులోనూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ఠ నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందిరి నాపుత్రిక అహల్య. ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనకి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.

మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశ్శక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొకప్రాంతానికి వెళుతుంటారు. అలా ఒకసారి గౌతమ ఆహల్య దంపతులు త్ర్యంబకేశ్వరుని సన్నిధివద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగినారు.

గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతములో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలినవారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తాలా ఒక వైపుకి వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసిన గౌతముడు ఆఱు నెలలు వరుణదేవునికై తీవ్రతపస్సు చేసినాడు. గౌతముడి పరోపకారబుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరినాడు. అప్పుడు ఆ వరుణుడు “ఓ మునీంద్ర! కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా! మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబద్ధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు” అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.

అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్రవిజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.

ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్రవీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపక పోవటమేకాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సరముతో బాధపడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనుకాడడు కదా!

గౌతముడు తప్పస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హానిచేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము! ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. “స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్చు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.

గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు అదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.

మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండితమండలిచే ఆమోదముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి.

“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథివై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరివై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు. గంగాదేవి కోరికపై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరీనది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.

No comments:

Post a Comment