Thursday, January 1, 2015

పుష్కరాలు అంటే ?

ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం.జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు,మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు),మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది.అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు.పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకు వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి.నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం.తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నం ,అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

స్నాన శక్తిని చెప్పే పుష్కరాల కధ - పుష్కరుడు కథ :

ఆధ్యాత్మిక పరంగా " తుందిలుడు " అనే ఒక మహర్షి శంకరుణ్ణి గురించి తపస్సు చేసాడు . ప్రత్యక్షమైన ఈశ్వరుడు ' ఏం కావాలి ' అన్నాడు . నన్ను నీలో లీనము చేసుకో స్వామీ అని అన్నాడు తుందిలుడు . శంకరుడు ఒక క్షణము ఆలోచించి సరే నంటూ తనలో లీనముచేసుకున్నాడు .

తుందిలుడు అంటే పెద్ద బొజ్జ కలవాడని అర్ధం ... అంటే పంచభూతాలూ తనలో దాగున్న ప్రపంచం అని భావము . ఆ పంచభూతాలూ ఒక్కటై శంకరుణ్ణి ప్రార్ధిస్తాయి. . . మేమంతా నీ అధీనములో ఉంటామని ... సరేనన్నాడు శంకరుడు . ఈ కారణముగా శంకరుడుకి ఐదు తలలుంటాయి. పంచభూతలింగాల పేరిట -- కంచి (పృధ్వీలింగం) ,జంబుకేశ్వరము(జల లింగం), తిరుణ్ణామలై(తేజోలింగం), శ్రీకాళహస్తి (వాయులింగం), చిదంబరం (ఆకాశ లింగం) అనే ప్రదేశాలున్నాయి. ఈ పంచభూతాలూ అన్నిటినీ అందరికీ ఈయగలిగిన శక్తి ఉన్నవని గ్రహించి ఈ పంచభూతాల సమిష్ఠి రూపానికి " పుష్కరుడు " (పుష్కలముగా అన్ని తనలోకలిగిన కారణముగా ఈయగలిగిన వాడు ) అని పేరు పెట్టారు. సృష్టిచేయాల్సిన అవసరము వచ్చిన బ్రహ్మ ... సృష్ఠి చేయడముకోసము పంచభూతాల అవసరము ఉందని గుర్తించి పంచభూతాల సమిస్టి రూపమైన పుష్కరుణ్ణి తనకీయమని సంకరుడు ని ప్రార్ధిస్తాడు .

బ్రహ్మ కున్న అవసరాన్ని గుర్తించిన శంకరుడు పుష్కరుణ్ణి బ్రహ్మకిచ్చేసాడు . ఇప్పుడు పంచభూతాలు సంకరుని అధీనము నుండి బ్రహ్మ అధీనానికి వచ్చేసాయి . మరికొంత కాలానికి బుద్ధికి అధిష్టాత అయిన బృహస్పతి ఈ పుష్కరుణ్ణి తనకీయమని బ్రహ్మని ప్రార్ధిస్తాడు . . . అంటే తన బుద్ధిశక్తిని ఆ బ్రహ్మ చేత సృష్టింపబడే అన్నిటికీ అందించాలనే భావము తో సరేనని బ్రహ్మ ఆ పుషరుణ్ణి బృహస్పతికి ఇచ్చేసాడు . ఆ పంచభూతాల సమిస్టిశక్తి అయిన పుష్కరుణ్ణి ఈ బృహస్పతి లోకములోని జనూలందరికీ వినియోగించదలిచి సంవత్సరానికి ఓ 12 రోజులు పాటు ఒక్కోనదిలో ఈ పుష్కరుణ్ణుని ఉండవలదింగా ఆజ్ఞ చేస్తాడు . ఆ 12 రోజులు ఎందరు ఆ నదిలో స్నానము చేస్తే ఆ అందరికీ పంచభూత శక్తి చేరుతుందని దీని భావము. అలా జరుగుతుందనే బృహస్పతి ఉద్దేశము .

ఏ నది ఏవైపుగా ప్రవహిస్తూ ఈ శక్తిని ఏ కాలములో పొందుతుందో ఆ రహస్యాన్ని కూడా మనకి వివరిస్తూ పుణ్యము కట్టుకున్నారు బృహస్పతి .

నది------------------------ రాశి
గంగా నది------------------ మేష రాశి
రేవా నది (నర్మద)------------ వృషభ రాశి
సరస్వతీ నది---------------- మిథున రాశి
యమునా నది-------------- కర్కాట రాశి
గోదావరి-------------------- సింహ రాశి
కృష్ణా నది------------------ కన్యా రాశి
కావేరీ నది------------------ తులా రాశి
భీమా నది------------------ వృశ్చిక రాశి
పుష్కరవాహిని/రాధ్యసాగ నది------ ధనుర్ రాశి
తుంగభద్ర నది---------------- మకర రాశి
సింధు నది----------------- కుంభ రాశి
ప్రాణహిత నది--------------- మీన రాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

No comments:

Post a Comment