Thursday, August 15, 2013

తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరాలయం


తిరుత్తణి తమిళనాడు లో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుపక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. త్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిల్వడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది.
చరిత్ర
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వంనుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. క్రీ.శ.875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీ.శ.907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది

కుమారతీర్థము
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి "జ్ఞానశక్తి ధరుడు" అనే పేరొచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

స్థల పురాణము
త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.
ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).
చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన, మన ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి, ఆయన సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతారు. ఇక్కడ తిరుత్తణి లో ఉన్న బ్రహ్మ తీర్థము లో కార్తికేయుని పూజించి, ఆయన తిరిగి ఆయన శక్తి సామర్ధ్యములను పొందారు.
దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే, ఇంద్ర తీర్థములో, “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతీ రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న “ సంఘనీతి, పద్మనీతి, చింతామణి ” మొదలగు దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.

No comments:

Post a Comment