Monday, June 29, 2015

జ్యోతిర్లింగ దర్శనం-సోమనాథ జ్యోతిర్లింగం

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.
బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు.
తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో
చూస్తూ,మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు.
మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా,దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో,
క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు.
ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు
ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు.
బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా
శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ
చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు.
ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర,
అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు

No comments:

Post a Comment