Thursday, September 19, 2013

కాశి

పావన గంగాతీరంలో గంగకు ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో, వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్‌లో ఉన్నది. గంగానదికి ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు వచ్చినది.

కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. ప్రళయకాలమందు కూడా, వారణాశికి నాశనము లేదట, ప్రళయకాలము సమీపించు సమయమున, సప్తరుషులు, తాము సురక్షితముగా ఉండు ప్రదేశాన్ని చెప్పమని కోరగా, ప్రళయకాలములో కూడా వారణాశి మునిగిపోకుండా త్రిశూలముతో గ్రుచ్చి ఎత్తి ఉంచుతాను.

గనుక అచట సురక్షితముగా ఉండండి అని సెలవిచ్చినాడు. కాశీ విశ్వనాధుడు, ఆవిముక్త వారణాశ్యాం, త్రికంట విరాజితే అని సంకల్పం చేస్తారు భక్తులు. ఒకప్పుడు వ్యాసుడు తన పదివేల శిష్యులతోను భిక్షాటనకు కాశీరాగా, అతనిని పరీక్ష చేయుటకు గాను, అన్నపూర్ణ విశ్వేశ్వరులు ఏడు దినములు భిక్ష లభించకుండా చేసినారు. అంత కోపితుడై వ్యాసుడు కాశీని శపించబోవ అన్నపూర్ణాదేవి ముతైదువ రూపమున ప్రత్యక్షమై భిక్ష అడిగినది. పిదప శంకరుడు వ్యాసుని కాశీ నుండి బహిష్కరించినాడు. అప్పుడు వ్యాసుడు క్షమింపమని కోరగా, నన్ను జూడవచ్చినవారు, నిన్ను కూడా దర్శిస్తారు. నీవు రాత్రిపూట నన్ను సేవింపవచ్చును అని శంకరుడు సెలవిచ్చినాడట. గంగానది ఆవలి భాగమున వ్యాసకాశి ఉన్నది. అచ్చట గంగ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది.

యిప్పటి ఈ మందిరం 1785లో అక్బరు చెల్లెలు అహల్యాభాయి గుడిని తిరిగి నిర్మించినది. మందిర గోపురమునకు 22 మణుగుల బంగారపు రేకు అమర్చినారు.

ఈ బంగారము పూర్వము రణజిత్ సింగు మహారాజుచే స్వామికి అర్పింపబడినది. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విశ్వనాథుని ఆలయం తెరచి యుండును.

మణి కర్ణికా ఘట్టము

గంగానదీ తీరమున 64 స్నాన ఘట్టములు కలవు, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది మణికర్ణికాఘట్టము, యాత్రీకులు ఈ ఘట్టమున స్నానముచేసి, విశ్వేశ్వరుని దర్శించుతారు. ఈ ఘట్టమునందెల్లప్పుడు శవ దహనములు జరుగుచుండును, పూర్వము మహావిష్ణవు ఇచట, తన చక్రముతో ఒక తటాకమును త్రవ్వి, దాని తీరమున శ్రీ విశ్వనాధుని గూర్చి తపస్సు చేసెను, శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తటాకమును చూచి విఘ్ణ దేవుని తపమునకు మెచ్చుకొనుచు తలయూచెను, అప్పుడు శివుని కుడిచెవినిగల, మణికుండలముజారి, ఆతటాకమున బడెను కావున ఆతటాకమునకు చక్రతీర్థమను పేరు కలిగెను. పిదప కొంత కాలమునకు, ఈ చక్రతీర్ధము మీదుగా నది ప్రవహించినది.

పది దోషాలు పోగొట్టే పావన గంగ

ముఖ్యంగా "గంగకు" దశహరా అని ఓ పేరు ప్రాచుర్యంలో ఉన్నది అంటే పదిరకాల దోషాలను పరిహరించేది అని అర్ధం. సకల పాప నివారిణి, గంగానది స్నానం ఏడేడు జన్మల పాపాలను పోగొట్టే శక్తి కలది.

హరిశ్చంద్ర ఘట్టము

పూర్వము హరిశ్చంద్ర మహారాజు వీరబాహువునకు, సేవకుడై అచటనే కాటికాపరిగా నుండెను. కాని ఇచట మణికర్ణికా ఘట్టములోవలె శవదహన సంస్కారములంతగా జరుగుటలేదు.

కాలభైరవ ఆలయం

విశ్వేశ్వర దర్శనమువలెనే, కాలభైరవ దర్శనంకూడ ముఖ్యం, గదోలియా జంక్షన్ నుండి మైలు దూరము ఉండును పూర్వము బ్రహ్మా అన్నింటికి మూలమగు పరబ్రహ్మము నేనే అను అహంకారముతో, పరమేశ్వరినికూడ దూరాలపములాడెను, అప్పుడు పరమేశ్వరుని తేజమునుండి కాలబైరవుడు, ఉద్భవించి, తన వాడిగోళ్ళతో బ్రహ్మయుక్క 5 వ తల ఊడబెరికెను, అంత ఆతల కాల భైరవుని చేతినంటుకొనిపోయెను. భైరవుడా శిరముతో లోకములన్నియు తురుగుచు కాశీ క్షేత్రమును ప్రవేశించగానే బహ్మహత్య పాతకమంతరించి తనచేతినంటియున్న బ్రహ్మకపాలము భూమిపై బడెను. అది మొదలు, కాల భైరవుడు కాశీయందే వశించియుండెను.

No comments:

Post a Comment