Wednesday, September 18, 2013

సద్గతులనిచ్చే గోవ్రతం

మన దైనందిన జీవితంలో మనతోపాటు మమేకమై కలసిపోయిన జీవి గోవు. గోవుని శ్రీమన్నారాయణుడి  రూపంగా
పురాణాలు చెబుతున్నాయి. ఈ చరాచర సృష్టిలోని సమస్త దేవతలు గోవులో నిక్షిప్తం అయి ఉన్నాయని, ఆ కారణంగా గోవును వధించడం, దూషించడం పాపంగా పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనాదిగా గోవును దైవస్వరూపంగా పూజిస్తున్నారు. 


మన నిత్య జీవితంలో ‘గోవు’ ఓ ప్రధానావసరంగా మనం  వినియోగించుకుంటున్నాం.  గోవుపాలు, పంచకం, నెయ్యి, పేడ ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడ్తున్నాయి. భౌతిక ప్రపంచంలో మనకు చేదోడువాదోడుగా ఉంటున్న ఈ గోవును పురాణాలలో దైవంగా అభివర్ణించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపమైన గోవును పూజించడం, అందునా ఓ  పద్ధతి  ప్రకారం పూజించడం సమస్త పుణ్యాలనిస్తుందంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి వాడుకలో ఉంది.


పురాణ గాథ:-
పూర్వమొకపుడు పాండురాజు భార్య అయిన కుంతీదేవి, తన మేనల్లుడు, శ్రీమన్నారాయణుడి అంశ అయిన శ్రీకృష్ణ్భగవానుని దగ్గరకు వెళ్ళి ‘‘మధుసూదనా...స్ర్తిలు దోషభూయిష్టమైన రుతుకాలంలో ఇంట్లోవారిని ముట్టుకోవడం, సూదితో వస్త్రాలను కుట్టడం లాంటి పనులు తెలిసీ తెలియక చేస్తూ వుంటారు. అలాగే పెద్దలను
నిందించడం, స్వపర  ద్రవ్యాపహరణం లాంటి దుష్కర్మలు తెలిసికొని, తెలియక కాని చేస్తూ వుంటారు. అలాంటి
దుష్టకార్యాలు చేసినపుడు సంక్రమించిన పాపాలు పోవడానికి ఆచరించాల్సిన వ్రతమొకదానిని చెప్పమని అడిగిందట. దానికి శ్రీకృష్ణ్భగవానుడు, కుంతీదేవిని ఉద్దేశించి, ఆయా పాపాలన్నీ పోవడానికి గోవ్రతమనే వ్రతం
ఉందని దానిని ఆచరిస్తే ఆయా పాపాలన్నీ పోయి, సర్వసౌఖ్యాలు సొంతమవుతాయని చెప్పాడు. ఈ
వ్రతం నాలుగు విధాలుగా ఉంటుందని, దీనిని ఆచరిస్తే పాప విముక్తులై, పుణ్యం సిద్ధిస్తుందని చెప్పాడు. అలాగే జపతపాలు, వ్రతోపవాసాలు తదితరాలవల్ల కలిగే పుణ్యం గోవ్రతంవల్ల కూడా కలుగుతుందని చెప్పాడు.
సూర్యుడు మకరంలోకి ప్రవేశించినపుడు కానీ, రథసప్తమినాడు కానీ, తమ జన్మనక్షత్రానికి అనుకూలమైనపుడు ఈ వ్రతాన్నిఆరంభించాలి. అలాగే రజోదోషం వీడిన స్ర్తిలు 18 నెలల తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. మకర సంక్రాంతి, రథ సప్తమి, మంగళవారంతో కూడినకృష్ణచతుర్దశి, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దోషాలు మటుమాయవౌతాయి. శ్రీకృష్ణుని సూచనమేరకు కుంతీమాత ఈ వ్రతాన్ని ఆచరించి, సద్గతి పొందింది. ఆనాటినుంచి ‘గోవు’దైవంగా పూజింపబడ్తూ, నీరాజనాలందుకుంటోంది. 


గోవ్రతం చేయడానికి నియమాలు:
* ఈ వ్రతం చేసేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి.
* నిత్యపూజాదికాలను ముగించుకున్న తర్వాత ఇంటికి తూర్పున మంటపం వేయాలి. అయిదు రంగులతో స్వస్తిక్,
పద్మక, నాగబంధాది మండలాలను నిర్మించాలి.
* లక్ష్మీనారాయణుడి ప్రతిమను బంగారం, వెండి లేదా యథాశక్తి చేయించి పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆవు, దూడ కల ప్రతిమను బంగారు, లేదా వెండి లేదా యథాశక్తి చేయించాలి. అనంతరం పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆ ప్రతిమలను బియ్యపురాశిలో ఉంచి పంచ పల్లవమాలతో పంచ వల్కలములతో నలంకరించి కలశాన్ని కొత్త వస్త్రాల చాపుతో చుట్టి పూజించాలి.
* అనంతరం దూడ కల్గినటువంటి ఆవును పూజించాలి.
* ఆవును రాత్రి నాలుగు జాములయందు పూజించి పురాణ శ్రవణాదులతో రాత్రి జాగారం చేయాలి.
* తర్వాత సంప్రదాయానుసారంగా అగ్నిప్రతిష్టచేసి, సమిధలు, పాయసాన్ని హవిస్సు చేసి, హోమం చేయాలి.
పూర్ణాహుతినిచ్చిన తర్వాత ఆచార్యునికి ప్రతిమను, వస్త్రాలతో దానమీయాలి.
* గో దానాన్ని శక్తి ఉంటే మిగిలిన దశ/షోడశ దానాలను చేసి పనె నండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.


ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు అన్ని వేదాలు చదివితే వచ్చే పుణ్యఫలాలను అన్ని తీర్థాలందు స్నానమాచరించిన
పుణ్యఫలాలను పొంది సద్గతులను పొందుతారని శ్రీకృష్ణ్భగవానుడు చెప్పాడు. 

No comments:

Post a Comment