Friday, August 30, 2013

ఏడుకొండల వెంకటేశుడికి ఉత్సవాలు

ఏడుకొండల వెంకటేశుడికి ఏడాది పొడవునా ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తారు. ఆయా మాసాల్లో నిర్దిష్టంగా ఆచరిస్తున్న సేవలు, ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో నేటికీ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు విశిష్ట కైంకర్యంగా నిర్వహిస్తారు. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం యేటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.

దోషాల నివారణార్థం:

వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ, మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటుచేసుకుంటాయి.అలాంటి దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటుచేసు కోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా ఆ దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియాకలాపంతో కూడిన కార్యక్రమాలుగా అత్యంత ప్రవిత్రంగా నిర్వహిస్తారు.

ఆలయ శాసనాలలో: తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుండే ఈ పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారని, అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులెందరో దానాలు చేసినట్టు ఆలయంలో లభించిన శాసనాలను బట్టి తెలుస్తోంది. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుండి టీటీడీ క్రమం తప్పకుండా యేటా శ్రావణమాసం ( ఆగస్టు) లోని శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశిలలో మూడు రోజులు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది.

మొదటిరోజు - అంకురార్పణ

పవిత్రోత్సవాలకు ముందురోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామి సేనాపతి అయిన విష్వక్సేనుడు పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయ నైరుతిదిశలోని వసంతమండపానికి చేరుకుంటారు. అక్కడే భూమిపూజ చేసి మృత్సంగ్రహణం (పుట్టమన్నును) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలోని అంకురార్పణ మండపంలో నవధాన్యాల బీజావాపం (అంకురార్పణం) చేస్తారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో మలయప్పస్వామి పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతో తయారుచేసిన పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ఏడు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించి హోమాలు నిర్వహిస్తారు. స్నానపీఠంపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పుసుపు, చందనాలతో తిరుమంజనం (అభిషేకం), ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

రెండో రోజు - సమర్పణ:

తొలి రోజులాగే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తిచేసి ముందురోజు ప్రతిష్టించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకెళ్లి గర్భాలయంలోని మూలమూర్తి... కిరీటం, మెడ, శంఖచక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి, వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామలక్ష్మణులు, రుక్మిణీ, శ్రీకృష్ణులవారు... వీరందరికీ సమర్పిస్తారు. జయవిజయులు, గరుత్మంతునికి, ఆనంద నిలయంపైన కొలువైన విమాన వేంకటేశ్వరునికి, ఆలయంలో పరివార దేవతలైన విష్వక్సేనుడు, యోగ నృశింహస్వామి, ఇతర దేవతామూర్తులు, ఉత్సవమూర్తులకు, రామానుజుల వారికి, పోటు తాయారు, పుష్పమండపంలోని శ్రీకృష్ణస్వామికి, ఇతర విగ్రహమూర్తులకు, ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామి మూలమూర్తికి, అదే ఆలయంలోని పరివార దేవతలకు, పుష్కరిణి గట్టుపై వెలసిన ఆంజనేయస్వామికి, అఖిలాండం వద్ద బేడి ఆంజనేయస్వామికి పట్టుపవిత్రాలు సమర్పిస్తారు.

మూడోరోజు - ముగింపు:

తొలిరోజు తరహాలో హోమాలు, అభిషేకాదులు, పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలకు వైఖానస ఆగమోక్త ఆచారాలతో ముగింపు పలుకుతారు.

No comments:

Post a Comment